జీవితం మీద విరక్తి కలగకూడదు

హనుమంతునికి
సీతజాడ తెలియక నిరాశతో తిరిగివెళ్ళడంకన్నా ఆత్మహత్య చేసుకుంటే మేలు అనుకుంటాడు. కానీ
బుద్ధిమంతుడు కనుక తక్షణం ఆ బలహీనత నుంచి బయట పడ్డాడు. సక్రమంగా అలోచించాడు. “వినాశే బహవో దోషా: జీవన్ భద్రాణి పశ్యతు”- ఇది హనుమంతుని మాట. ఈ ఒక్క వాక్యాన్ని మంత్రంలా మననం చెస్తే
చాలు. నేటితరం అంతా వాళ్ళ గది గోడల మీదనో, డైరీ మొదటి పేజీలోనో మొత్తానికి హృదయఫలకంపై
బలంగా లిఖించుకోదగిన వాక్యమిది. “చనిపోవడంలో చాలా దోషాలున్నాయి. జీవించి ఉంటే చాలు
శుభాలను చూడవచ్చు ” ఒక్కొక్కసారి అంతా శున్యమే అనిపిస్తుంది. కానీ ఆ క్షణం దాటితే అంతా
మేలే కలగవచ్చు. ఈ లోపల తొందరపడి మృత్యువుని స్వాగతిస్తే, ఆ శుభాలన్నీ అందుకొనే అవకాశమే
మిగలదు. ఈ వాక్యంతో ఆత్మబలాన్ని పుంజుకున్న హనుమ ఆశావాదం ఫలించింది. అశోకవనంలో సీతజాడ
దొరికింది. ఆశావాదానికున్న సత్ఫలం అది.
“అలలా వచ్చిన
దిగులే అంతాకాదు”.
తనకుమారులందరూ
విశ్వామిత్రుని కారణంగా మరణించాక వసిష్ఠునికి దు:ఖోద్రేకం కలుగుతుంది. కొండపైనుండి
దూకి ప్రాణాలు తీసుకోవాలనుకుంటాడు. ఈ లోపల భూదేవి ఆయనను చేతితో పట్టి కాపాడి మందలిస్తుంది-”
ఓ వెర్రీ! చచ్చిపొతే జీవితం తీరిపోతుందా?” అని ప్రశ్నిస్తుంది. ఇది చాలా సూటి ప్రశ్న.
మరణిస్తే దేహాన్ని కోల్పోతాం. కానీ మరో ఉపాధితో జీవించక తప్పదు. అప్పుడు ఇప్పటి ఆత్మహత్యాపాపఫలాన్ని
సైతం అనుభవించవలసిందే. నిజంగా జీవితం పై విరక్తి వస్తే `శాశ్వతశాంతి ‘ కి చేరువయ్యేందుకు
ఈ జీవితాన్ని వినియోగించుకోవాలి. ఙ్ఞానాన్ని సంపాదించాలి. దీనితో తపస్సుచేసి బ్రహ్మఙ్ఞానంతో
సుస్థిర శాంతిని పొందుతాడు. ఈ కథలో జీవుని పరంగా తాత్త్విక స్పృహతో ఆత్మహత్యా ప్రయత్నం
అవివేకం అని స్పష్టపరచారు.
ఇలా ధార్మికంగా,
లౌకికంగా, తాత్త్వికంగా ఆలోచించినా జీవితానికన్నా విలువైనది లేదు. ముందు మనం-అటు తరువతే
లోకం. బయట వస్తువులపై, వ్యక్తులపై మమకారం, ఆశా పెంచుకొని అవికోల్పోతే బతుకునే బలి చేసుకొనడం
మూర్ఖత్వం. బయట వస్తువు లభించక ముందూ మనం ఉన్నాం. అది పోయినా ఉంటాం. మనల్ని నాశనం చేసుకొనే
హక్కు మనకే లేదు. “ ఓర్చినమ్మకి తేటనీరు ‘ అన్నట్లు సహనానికి ఫలం సౌభాగ్యమే.
Comments
Post a Comment